Luke 8 · తెలుగు బైబిల్

Luke

Chapter 8

తెలుగు బైబిల్
1వెంటనే ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా
2పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి.
3వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి.
4బహు జనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను
5విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మింగివేసెను.
6మరి కొన్ని రాతినేలనుపడి, మొలిచి, చెమ్మలేనందున ఎండి పోయెను.
7మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను.
8మరికొన్ని మంచినేలనుపడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచువినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను.
9ఆయన శిష్యులు ఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా
10ఆయనదేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడు చున్నవి. )
11ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము.
12త్రోవ ప్రక్కనుండువారు, వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమెత్తి కొని పోవును.
13రాతినేలనుండు వారెవరనగా, విను నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనకాలమున తొలగిపోవుదురు.
14ముండ్ల పొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవనసంబంధమైన విచారముల చేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు.
15మంచి నేల నుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్య మైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.
16ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభముమీద దానిని పెట్టును.
17తేటపరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయ బడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు.
18కలిగినవానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి తనకు కలదని అనుకొనునదికూడ తీసివేయబడునుగనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను.
19ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయనదగ్గరకు రాలేక పోయిరి.
20అప్పుడునీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి.
21అందుకాయనదేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను.
22మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి.
23వారు వెళ్లు చుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి
24గనుక ఆయన యొద్దకు వచ్చిప్రభువా ప్రభువా, నశించిపోవుచున్నా మని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి, గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమా యెను.
25అప్పుడాయన మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడి
26వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి.
27ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టు కొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు.
28వాడు యేసును చూచి, కేకలువేసి ఆయన యెదుట సాగిలపడియేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను.
29ఏలయనగా ఆయనఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచువచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలిసంకెళ్లతోను కట్టి కావలియందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను.
30యేసునీ పేరేమని వాని నడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక,
31వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను.
32అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయు చుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను.
33అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోనికి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను.
34మేపుచున్నవారు జరిగినదానిని చూచి, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి.
35జనులు జరిగినదానిని చూడవెళ్లి, యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని, స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి.
36అది చూచినవారు దయ్యములు పట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా
37గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి.
38ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను.
39అయితే ఆయన - నీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెట్టి గొప్పకార్యములు చేసెనో తెలియ జేయుమని వానితో చెప్పి వానిని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెట్టి గొప్పకార్యములు చేసెనో ఆ పట్టణ మందంతటను ప్రకటించెను.
40జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగివచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.
41అంతట ఇదిగో సమాజ మందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీద పడి
42యించుమించు పండ్రెండేండ్ల యీడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగ ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి.
43అప్పుడు పండ్రెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీ యెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి
44ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.
45నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును - మేమెరుగమన్నప్పుడు, పేతురు - ఏలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా
46యేసు - ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలి పోయినదని, నాకు తెలిసినదనెను.
47తాను మరుగై యుండలేదని, ఆ స్త్రీ చూచి, వణకుచు వచ్చి ఆయన యెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను.
48అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను.
49ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి యొకడు వచ్చి - నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమపెట్టవద్దని అతనితో చెప్పెను
50యేసు ఆ మాటవిని - భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి
51యింటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు.
52అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా, ఆయన వారితో - ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చప్పెను.
53ఆమె చనిపోయెనని వారెరిగి ఆయనను అపహసించిరి.
54అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని చిన్నదానా, లెమ్మని చెప్పగా
55ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను.
56ఆమె తలిదండ్రులు విస్మయము నొందిరి. అంతట ఆయన - జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.
Bible Study with Steffi App

Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.

Download Free ↗
Memorize in App ↗

Choose Theme